Thursday, February 23, 2012

Metta Polinaidu , మెట్ట పోలినాయుడు



రచన...నటన...దర్శకత్వం...ఉద్యోగం-నాటకాల్లో రాణిస్తున్న పోలినాయుడు--వివిధ పోటీల్లో బహుమతుల కైవసం

ప్రతీ మనిషికీ వృత్తితో పాటు ఏదో ఒక అభిరుచి ఉండడం సహజం. కొందరు మాత్రమే తమ అభిరుచితో ఇతరులకూ స్ఫూర్తినిస్తూ రాణిస్తుంటారు. వృత్తిపరంగా తీరిక లేకున్నా ఎలాంటి ఆర్థికలాభం చేకూరకపోయినా తమ అభిరుచికి సమయాన్ని కేటాయిస్తూ మానసిక తృప్తి పొందుతూ తమ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తుంటారు. అటువంటి కోవలోకే వస్తారు ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట పంచాయతీ పరిధి సనపలవానిపేటకు చెందిన మెట్ట పోలినాయుడు. ఈయన వృత్తిరీత్యా పంచాయతీరాజ్‌శాఖలో జూనియర్‌ సాంకేతిక అధికారి అయినప్పటికీ చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతోతనకున్న కళాతృష్ణతో నాటకరంగంలో రాణిస్తూ వివిధ పోటీల్లోపాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. పలువురి మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారు.

పోలినాయుడు తండ్రి అప్పారావు నాటక రంగంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పారావుకు ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు పోలినాయుడు కాగా, రెండో కుమారుడు వెంకటరాజు. వెంకటరాజు జ్యుడీషియల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురూ పలు నాటికల్లో నటించి మెప్పించారు.

  • మూడు కళానైపుణ్యాల్లో రాణింపు
పోలినాయుడు నాటకాల్లో నటించడమే కాక నాటకాలకు దర్శకత్వం వహించడంతో పాటు నాటకాలను రచించడంలో రాణిస్తున్నారు. పోలినాయుడు 8వతరగతి చదువుతున్నప్పుడే స్నేహితులతో పాఠశాలలోనే నాటకాలు ప్రదర్శించేవారు. ఈ స్ఫూర్తితోనే గ్రామంలో యువకులతో నాటకాలు ప్రదర్శించేవారు. తన తండ్రితో నటించే వాటికి తానే దర్శకత్వం వహించేవారు.

  • రచించిన నాటకాలు
భూమి కోసం, ఎన్నాళ్లీ అంధకారం, బలి, సారీ స్వాతంత్య్రం వచ్చింది.

నటించిన నాటకాలు
హుష్‌కాకి, ఎన్నాళ్లీ అంధకారం, ఆసరా, ఆనందామృతం, సారీ స్వాతంత్య్రం వచ్చింది, గమనిక, అగ్నిపథం,అరణ్యఘోష, నీతి నీ స్థానమెక్కడ, కట్నాలు-కాపురాలు తదితర పలు సందేశాత్మక నాటకాలు ప్రదర్శించి బహుమతులు కైవసం చేసుకున్నారు. దీనికితోడు 85 నాటకాలకు దర్శకత్వం వహించారు.

  • ఎన్నో పురస్కారాలు
* 1992లో సిల్లా లచ్చయ్య మెమోరియల్‌ ఆర్ట్స్‌ సంస్థ ద్వారా ఉత్తమ హాస్య నటుడు అవార్డు పొందారు.
* 1992లో హుష్‌కాకి నాటకానికి ఉత్తరాంధ్ర ఉత్తమ నటుడు అవార్డు సాధించారు.
* 1999లో చీమకుర్తిలో జరిగిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడు అవార్డు´ను కైవసం చేసుకున్నారు.
* 2004లో జాతీయ స్థాయిలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఖరగ్‌ పూర్‌లో ప్రవాసాంధ్రుల నవ్య కళాపరిషత్తు ఆధ్వర్యంలో నాటకం ప్రదర్శించి బహుమతులు సాధించారు.
* 2010లో రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో 'మొక్కు' నాటకం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటుడు, దర్శకుడు అవార్డులు పొందారు.
* జిల్లాస్థాయి రంగస్థల కళాకారులు నాటక పోటీల్లో ఏటా ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, సహాయ నటుడు తదితర బహుమతులు పొందారు.
* 2009లో కవిటి మండలంలో బొరివంకలో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా, దర్శకుడిగా బహుమతులు కైవసం చేసుకోగా, ఆయన సోదరుడు వెంకటరాజు ప్రతినాయకుడిగా అవార్డు పొందారు.

* అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్తులో ఏటా జరిగే నాటక ప్రదర్శనలో నాటకం ప్రదర్శించి నాగేశ్వరరావు మన్ననలు, ప్రశంసలు పొందారు.

  • నాటక రంగాన్ని బతికించాలన్నది నా ఆశయం
నా తండ్రి అప్పారావునాయుడు స్ఫూర్తితోనే నాటక రంగంలో రాణిస్తున్నాను. ఆయన ప్రోత్సాహం మరువరానిది. గ్రామంలో అరుణోదయ ఆర్ట్స్‌ పేరుతో నాటకాలను ప్రదర్శిస్తున్నాం. 2000లో 'మదర్‌ ఆర్ట్స్‌' సంస్థను స్థాపించాను. రాష్ట్రంలో, దేశంలో నలుమూలలా ప్రదర్శనలిస్తున్నాం. నటన జీవితానికి మార్గదర్శకత్వంవహిస్తూ సమాజంలో గుర్తింపు తెచ్చిపెడుతుంది. నాటక రంగాన్ని బతికించాలన్నది నా ఆశయం. ఇందు కోసం నూతన కళాకారులను ప్రోత్సహిస్తున్నాను.
- మెట్ట పోలినాయుడు, సనపలవానిపేట గ్రామం

  • ===========================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment